||సుందరకాండ ||

||ఏభయ్యవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||
తముద్వీక్ష్య మహాబాహుః పింగాక్షం పురతః స్థితమ్|
కోపేన మహతాఽఽవిష్టో రావణో లోకరావణః||1||
శంకాహృతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసా వృతమ్|

స|| మహాబాహుః లోకరావణః సః రావణః పురతః స్థితం మహాబాహుం పింగాక్షం మహతా కోపేన ఆవిష్టః స తేజసా వృతం కపీంద్రం ఉద్దీక్ష్య సంకాహృతాత్మా దధ్యౌ||

తా||మహాబాహువులు కల లోకకంటకుడు అయిన ఆరావణుడు ముందు నుంచుని ఉన్న మహబాహువులుకల ఆ వానరుని మహత్తరమైన కోపము తో చూచి ఆ వానరేంద్రుని తెజస్సుతో రావణుని మనస్సులో శంకలు రేకెత్తెను.

సుందరకాండ.
అథ పంచాశస్సర్గః||

మహాబాహువులు కల లోకకంటకుడు అయిన ఆ రావణుడు తన ముందు నుంచుని ఉన్న మహబాహువులుకల ఆ వానరుని మహత్తరమైన కోపము తో చూచెను. ఆ వానరేంద్రుని తేజస్సు రావణుని మనస్సులో శంకలు రేకెత్తెను.

"పూర్వము కైలాసమును కదిలించినపుడు ఎవరిచేత శపింపబడితినో, ఆ భగవాన్ నంది సాక్షాత్తు ఇక్కడికి వచ్చెనా? లేక ఇతడు వానరరూపము లోవచ్చిన బాణాసురుడా ఏమి?'

అప్పుడు రావణుడు క్రోధముతో నిండిన కళ్ళు కలవాడై, మంత్రిసత్తముడు అగు ప్రహస్తునితో కాలానుగుణముగా అర్థవంతముగా ఈ వచనములను పలికెను.

' ఈ దురాత్ముని అడుగుడు. ఎక్కడినుంచి వచ్చెను? ఏ కారణము వలన వనము భంగపరచి రాక్షస్త్రీలను భయపెట్టెను? దానికి అర్థమేమి. దుర్భేధ్యమైన నా నగరమునకు రావడములో ఇతని ప్రయోజనమేమి? యుద్ధము చేసి బీభత్సము చేయుట ఎందుకు?'

రావణుని మాటలను విని ప్రహస్తుడు ఇట్లు పలికెను. ' ఓ వానరా ! నీకు క్షేమము అగుగాక. భయపడవలదు. నీకు ఆశ్వాసమివ్వబడిది. ఓ వానరా ఇంద్రుని చేత ఈ రావణాలయమునకు పంపబడినచో అది చెప్పుము. భయపడకుము. నీవు బంధము నుంచి మోక్షము పోందెదవు'.

' ఈ చారుని రూపములో ఈ నగరమును ప్రవేశించిన నీవు కుబేరుని లేక యముని లేక వరుణుని దూతవా ? లేక విజయముకోరి విష్ణువు చేత పంపబడిన దూతవా? నీవు రూపమునకు మాత్రము వానరుడవు. తేజస్సుతో వానరుడవు కావు. ఇప్పుడు నీ నిజము చెప్పుము. అప్పుడు తప్పక బంధవిముక్తుడవు కాగలవు. నీవు అబద్ధము చెప్పినచో జీవించుట దుర్లభము. ఈ రావణాలయము నీ ప్రవేశము ఎందుకొరకు?

ఈ విధముగా అడగబడిన వానరోత్తముడు ఆ రాక్షసగణముల అధిపతికి ఇట్లు చెప్పెను.

" నేను ఇంద్రుని యముని వరుణుని వాడను కాను. నేను కుబేరుని సఖ్యుడను కాను. విష్ణువుచేత పంపబడిన వాడను కాను. నేను జాతి రూపముగా వానరుడనే. నేను వానరుడను ఇక్కడికి వచ్చినవాడను. రాక్షసేంద్రుని దర్శనము దుర్లభము. అందువలన రాక్షసరాజుయొక్క దర్శనార్థము ఈ వనమును నాశనము చేసితిని. అప్పుడు బలవంతులైన రాక్షసులు యుద్ధకాంక్షతో తలపడిరి. దేహరక్షణార్థము నేను యుద్ధము చేసితిని. నన్ను దేవాసురల అస్త్రములతో బంధింప శక్యము కాదు. ఇది బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరము. రాజుని చూచు కోరికతో నేను బ్రహ్మాస్త్రమునకు లొంగిపోతిని. రాక్షసులచే బంధింపబడి ఆ అస్త్ర ప్రభావము తొలగి పోయినది. ఓక ముఖ్య రాజకార్యముతో నీ దర్శనము సంపాదించితిని'.

' నేను అమిత తేజస్సు కల రాఘవుని దూతని అని తెలిసి కొనుము. ఓ ప్రభో నేను చెప్పే హితవచనములను వినుము.'.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఏభయ్యవ సర్గ సమాప్తము



||ఓమ్ తత్ సత్||

దూతోహమితి విజ్ఞేయో రాఘవ స్యామితౌ జసః|
శ్రూయతాం చాపి వచనం మమ పథ్య మిదం ప్రభో||19||

స|| అహం అమిత తేజసః రాఘవస్య దూతః ఇతి విజ్ఞేయః |ప్రభో ఇదం మమ పథ్యం వచనం శ్రూయతాం చాపి||
తా||'నేను అమిత తేజస్సు కల రాఘవుని దూతగా తెలిసి కొనుము. ఓ ప్రభో నేను చెప్పే హితవచనములను వినుము'
||ఓమ్ తత్ సత్||